Saturday, June 27, 2020

సంగీత యోగం


సంగీతానికి తలలు ఊపని ప్రాణి సృష్టిలో లేదు. పసిపిల్లల దగ్గర నుంచి పాముల వరకు సంగీత మాధుర్యంలో ఓలలాడతారని శాస్త్రం చెబుతోంది. పసిపాప భూమి మీద పడి కేర్‌కేర్‌మంటూ ఏడుపు ప్రారంభించగానే సంగీత జ్ఞానం లేని తల్లి సైతం ఏదో ఒక జోల పాట పాడటానికి ప్రయత్నిస్తుంది. సాక్షాత్తు అన్నమయ్యే ఆ భగవంతుడికి ‘జో అచ్యుతానంద జోజో ముకుందా’ అంటూ జోలపాడాడు. పాటకు అంత శక్తి ఉంది. ఉద్యమాలన్నీ పాటల మీద నడిచి, ఉద్యమాలను ముందుకు నడిపాయి. 
ఇక జానపదులు ప్రతి పనికీ ఒక పాట పాడుతూనే ఉంటారు. వడ్లు దంచుతూ ఏకంగా రామాయణాన్నే పాడారు నాటితరం వారు. అలా రామాయణం స్త్రీలపాటల రూపంలో వచ్చింది. బండి నడుపుతూ పాట, పంట కోతలు కోస్తూ పాట, నూర్పుళ్లు, తూర్పారపోయడం, ధాన్యం బస్తాల్లోకి ఎత్తి, గాదెల్లో నింపడం... పని ఏదైనా సరే.. పాడుకుంటూ అలసటను మరచిపోతారు. రజకులు వస్త్రాలను ఉతుకుతూ, ‘ఉష్‌..ఉష్‌’ అంటూ ఒక రాగాన్ని ఆలపిస్తారు. బరువులు ఎత్తేవారు ‘హైసా, హైసా’ అంటూ వారికి తోచినది పాడుతూ, బరువు ఎత్తటం వల్ల కలిగే అలసటను మరచిపోతారు. 
వివాహాలలో వియ్యపురాలిని ఆటపట్టిస్తూ, ‘వియ్యపురాలా ఓ వయ్యారి భామా నీ ఒయ్యారములేలనే’ అంటూ వేడుకగా పాడుకుంటారు. బావగారిని ఆటపట్టిస్తూ మరదలు, ‘ఓహోహో బావగారు ఎప్పుడొచ్చారు, ఈ చిల్లు చెంబులో నీళ్లున్నాయి కాళ్లు కడుక్కోండి’ అంటూ పాడుతుంది. ఏ పనిలోనైనా పాట ఒక ఆశ్వాసన ఇస్తుంది. 
శాంతము లేక సౌఖ్యము లేదు అన్నాడు త్యాగరాజు. ప్రస్తుతం అందరం మనసు, శరీరం, ఆలోచన అన్నీ సక్రమంగా, ప్రశాంతంగా ఉంచుకోవలసిన సమయం ఇది. మనసుకు ఆనందాన్ని కలిగించటంలో సంగీతానికి మించినది లేదు. అనంతకోటి రాగాలలో కొన్ని రాగాలు వినగానే మనసుకు హాయిగా అనిపిస్తుంది. సినిమా పాటలైతే ‘పాట చాలా మెలోడియస్‌గా ఉన్నాయి’ అంటాం. అవే మనసుకు ఆనందాన్ని, ఉల్లాసాన్ని, ప్రశాంతతను కలిగించే రాగాలు. ఒక పక్కన కరోనా మహమ్మారి గురించి అందరిలోనూ ఏదో తెలియని భయం బయలుదేరింది. అలజడితో ఉన్న మనసుకు సాంత్వన కావాలనిపిస్తు్తంది. ఇటువంటి సమయంలోనూ సంగీతమే మనలను ఉత్తేజపరుస్తుంది. అటువంటి కొన్ని రాగాలను చూద్దాం.
సామ రాగం (సరిమపదస... సదపమగరిస)
ఈ రాగం పేరుతోనే అర్థమవుతుంది.. ఎంతో సౌమ్యంగా ఉంటుందని. ఈ రాగంలోనే త్యాగరాజు ‘శాంతము లేక సౌఖ్యము లేదు, సారసదళ నయనా’ అంటూ మనం ప్రశాంతంగా ఉంటేనే హాయిగా ఉండగలుగుతామని ఒక కీర్తన రాశాడు. మనకు బాగా సరిచితమైన ‘గుప్పెడు మనసు’ చిత్రంలో మంగళంపల్లి బాలమురళి గానం చేసిన ‘మౌనమె నీ భాష ఓ మూగ మనసా’ ఈ రాగం ఆధారంగా చేసినదే. ఇంకా శంకరాభరణంలోని సదాశివబ్రహ్మం రచించిన ‘మానస సంచరరే, బ్రహ్మణి మానస సంచరరే’ కూడా ఈ రాగంలో చేసినదే. 
2. మలయమారుతం.. (సరిగపదనిస.. సనిదపగరిస)
ఈ రాగంలో త్యాగరాజు ‘మనసా ఎటులోర్తునే నా మనవిని చేకొనవే’ అంటూ మనసుకు ఆహ్లాదం కలగించమని భగవంతుడిని కీర్తించాడు. ఈ రాగంలోనే ‘ఉయ్యాల జంపాల’ చిత్రంలోని ‘కొండగాలి తిరిగింది, గుండె ఊసులాడింది’ పాటను స్వరపరిచారు.
3. మోహన రాగం (సరిగపదస.. సదపగరిస)
‘నను పాలింపగ నడచి వచ్చితివా’ అంటూ త్యాగయ్య ఈ రాగంలో సాక్షాత్తు భగవంతుడు తనను పాటించటానికి వచ్చాడని సంతోషంతో కీర్తించాడు. ఈ రాగంలో స్వరాలను ఇముడ్చుకుని, మనలను బాగా ఆకట్టుకుని, పడవ మీద ప్రయాణింపచేసిన పాట ‘మాయాబజార్‌’ చిత్రంలోని ‘లాహిరిలాహిరి లాహిరిలో’.
4. హిందోళ (సగమదనిస.. సనిదమగస)
ఈ రాగంలో త్యాగరాజు రచించిన ‘సామజవరగమనా’ అందరికీ సుపరిచితమైన కీర్తన. ‘సువర్ణ సుందరి’ చిత్రంలోని ‘పిలువకురా అలుగకురా’ పాట ఈ రాగంలో సంగీతం సమకూర్చినదే.
5. వలజి (సగపదనిస.. సనిదపగస)
ఈ రాగంలో ఓగిరాల వీర రాఘవశర్మ ‘శ్రీగాయత్రీదేవీ’ అంటూ అమ్మవారిని కీర్తించాడు. ఇదే రాగంలో ‘శ్రీకాకుళంధ్ర మహావిష్ణు కథ’ చిత్రంలో ‘వసంత గాలికి వలపులు రేగ /వరించు బాలిక మయూరి కాగా/తనువు మనసు ఊగితూగి/ఒక మైకం కలిగేనులే/ఈ మహిమ నీదేనులే/ప్రేమ తీరు ఇంతేనులే.. ’, ‘ప్రేమించి చూడు’ చిత్రంలో పి. బి. శ్రీనివాస్‌ పాడిన ‘వెన్నెల రేయి ఎంతో చలి చలి వెచ్చని దానా రావా నా చెలి’ పాటలు ఈ రాగంలో స్వరపరిచినవే.
6. మధ్యమావతి (సరిమపనిస.. సనిపమరిస)
ఈ రాగంలో ‘అలకలల్లలాడగ గని’ అంటూ రాముడిని కీర్తించాడు త్యాగయ్య. ఇదే రాగంలో ‘ధర్మదాత’ చిత్రంలోని ‘జో లాలీ, లాలీ నా చిట్టి తల్లీ’ పాటను స్వరపరిచారు.

మ‌న‌సుకి ప్ర‌శాంతంగా ఉంటుంది
 
కొన్ని రాగాలు మనసుకు ఉల్లాసం కలిగించడనికి కారణం స్వరస్థానాల మధ్య దూరం ఉండటమే. సంగీతం సప్తస్వర సమ్మిళితం. కాని ఈ రాగాలలో కేవలం ఐదు స్వరస్థానాలు మాత్రమే ఉంటాయి. దూరంగా ఉంటేనే ప్రశాంతంగా ఉంటుంది. అంటే అర్థం కొన్ని స్వరస్థానాల కలయిక వల్ల ఆ మాధుర్యం వస్తుంది. ‘సరిగమపదని’ అనే స్థానాలలో రి అక్షరం మొత్తం మూడు రకాలుగా ఉంటుంది. గ రెండు రకాలుగా ఉంటుంది. అంటే స పక్కన మొదటి రి కాకుండా రెండో రి వస్తే అప్పుడు వాటి కలయిక కారణంగా పాటకు మాధుర్యం వస్తుంది. స పక్కన మొదటి రి, గ పక్కన మొదటి మ వస్తే అవి వీరోచిత రాగాలుగా వినిపిస్తాయి. దూరం ఉండాలి కాని, దూరంగా ఉండకూడదు. అటువంటివి ఈ రాగాలన్నీ. ఈ రాగాలు వింటే మానసిక ప్రశాంతత వస్తుంది. 
– మోదుమూడి సుధాకర్, ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు. 

-------------------------------------------------

మ‌నఃస్థితికి అనుగుణంగా రాగాలు..

మానసిక ఆరోగ్యం కోసం ఎక్కువ శక్తివంతంగా ఉండే రాగాలను వినిపిస్తాం. సంతోషం కోసం హంసధ్వ‌ని రాగాన్ని వినిపిస్తాం. కేదారగౌశ, ధీర శంకరాభరణం వంటి రాగాలు ఉత్తేజాన్ని కలిగిస్తాయి. అభోగి రాగం ప్రశాంతతను చేకూరుస్తుంది. అభేరి సంతోషాన్ని ఇస్తుంది. నేను రాగాల మీద పరిశోధన చేశాను. ఏ రాగం ఎటువంటి సమయంలో, ఏ విధంగా పనిచేస్తుందనే అంశం ఆధారంగా అవసరమైన వారికి మ్యూజిక్‌ థెరపీ చేస్తాను. 
– డాక్టర్‌ మీనాక్షి రవి, డైరెక్టర్, మీరా సెంటర్‌ ఫర్‌ మ్యూజిక్‌ థెరపీ, బెంగళూరు.
–––––––––––––––––––
– సంభాష‌ణ‌: వైజయంతి పురాణపండ

No comments:

Post a Comment