నిజాయితీగా ఉండటం తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్నారు.
తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ తండ్రి నుంచి అలవర్చుకున్నారు.
తెలుగులో సివిల్స్ రాసే ధైర్యం తండ్రి నూరిపోసినదే.
అవమానాలను ఎదుర్కొనే ఆత్మస్థయిర్యం తండ్రి ద్వారానే సంక్రమించింది. అనుకున్నది సాధించే పట్టుదల తండ్రి నుంచి వచ్చినదే.
ఆ తండ్రి డా. ఆకురాతి కోదండరామయ్య.
ఆ కుమార్తె విజయవాడకు చెందిన ఆకురాతి పల్లవి ఐఏయస్
గాంధేయవాది...
‘చిన్నప్పుడు స్కూల్లో చదువుతుండే రోజుల్లో, లంచ్ టైమ్లో మామిడిచెట్ల కింద కూర్చుని భోజనాలు చేసేవాళ్లం. ఒకరోజు శారద అనే నా ఫ్రెండ్ బాక్సు తెచ్చుకోలేదు. ఎందుకు తెచ్చుకోలేదని అడిగితే, ‘‘నేను అలిగి, ‘బాక్సు వద్ద’న్నాను. ‘నువ్వు ఒక రోజు తినకపోతే అన్నం మిగులుతుంది’ అన్నారు మా వాళ్లు’’ అని నవ్వుతూ చెప్పింది. అంత పేదరికంలో ఉన్నారు వాళ్లు. అప్పుడు అనిపించింది పేద పిల్లలకు సహాయం చేయాలని. నా మనసులో మాట నాన్నతో పంచుకున్నాను. అందుకు ఐఏయస్ చదవాలన్నారు నాన్న. అప్పుడే నాలో పట్టుదల బయలుదేరింది.
నాన్నే నేర్పించారు...
నాకు చిన్నతనం నుంచి స్వాభిమానం ఎక్కువ. మాట పడలేను. అందుకే పద్నాలుగు పాఠశాలలు మారాను. ఇక లాభం లేదని డిస్టెన్స్లోనే చదువు కొనసాగించాను. అది కూడా తెలుగు మాధ్యమంలోనే చదువుకున్నాను. గాంధీగారు మాతృభాషలో చదివించమని చెప్పిన మాటలు నాన్న పాటించారు.
ఐఏయస్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను కొంచెం ఇబ్బంది పడ్డాను. కోచింగ్ సెంటర్ల వాళ్లు నన్ను అవమానించారు. నాలో పట్టుదల మరింత ఎక్కువైంది. తెలుగు మీడియంలో చదవటం వల్ల, తెలుగు నుంచి ఆంగ్లంలోకి అనువాదం చేయటంలో నాన్న ఎంతగానో సహయపడ్డారు. కొన్ని చాప్టర్లు ఆయనే ట్రాన్స్లేట్ చేసి ఇచ్చారు. అలా ఆయన సహకారంతోనే నేర్చుకున్నాను. నేను నేర్చుకున్న ఆ కొద్దిపాటి ఇంగ్లీషు ఇప్పుడు నా ఆఫీసు విషయంలో ఎంతగానో ఉపయోగపడుతోంది.
నాన్నే ఎగ్జామినర్...
ఐఏయస్ మోడల్ ఎగ్జామ్స్ నాన్నే ఇంట్లో కండక్ట్ చేశారు. పాత పేపర్లు, మోడల్ పేపర్లు చూసి, పరీక్షరాయించి దిద్దేవారు. నేను కూతుర్ని కాబట్టి నాకు ఎక్కువ మార్కులు వేస్తున్నారని నాన్నతో అనటంతో, నాన్నకు తెలిసిన లెక్చరర్లకు నా పేపర్లు పంపించి, దిద్దిస్తే, నాన్న వేసిన మార్కుల కంటె ఎక్కువ మార్కులు వచ్చేవి. అప్పుడు కాస్త నా మీద నాకు నమ్మకం ఏర్పడింది. నాన్నగారు పెట్టిన పరీక్షలను కూడా నిజం పరీక్షల్లాగా చాలా సీరియస్గా రాసేదాన్ని. నేను ఆప్షనల్గా హిస్టరీ తీసుకోవటానికి కారణం కూడా నాన్నే. చరిత్ర నాన్నగారే చెప్పారు.
నాన్నే నా స్నేహితుడు..
నాన్న ఆర్గానిక్ కెమిస్ట్రీలో పి.హెచ్డి చేశారు. ఆయన మాకు ఒక స్నేహితుడిలా సలహాలిస్తారు. ఐఏయస్ ఇంగ్లీషు మీడియంలో రాద్దామని ప్రయత్నించి మానేశాను. తెలుగు మీడియంలోనే రాశాను. అందుకు నాన్న ఇచ్చిన ప్రోత్సాహం నేను మరచిపోలేను. సుప్రీంకోర్టు, హైకోర్టు విషయాలలో ఇంగ్లీషులోనే మేనేజ్ చేస్తున్నాను. ఎనిమిది సంవత్సరాల పాటు తెలుగును ఇంగ్లీషులోకి అనువదించి నేర్చుకోవటం వల్లే ఇప్పుడు నాకు ఇబ్బంది లేకుండా ఉంది. ఆ విషయంలో నేను నాన్న ఋణం తీర్చుకోలేను. నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ. నేను ప్రిపేర్ అవుతున్న టైమ్లో, ఇంటి నుంచి రెండు సందుల అవతల రూమ్ తీసుకుని, ఐఏఎస్కి సెలక్ట్ అయ్యేవరకు ఒంటరిగా గదిలో ఉంటూ చువుకునే ధైర్యాన్ని నాన్నే నేర్పించారు. నిరంతరం పుస్తకాలు చదువుతూండేదాన్ని. నాన్న క్యారేజీ తెచ్చేవారు. ఆ సమయంలో, పోతన, ధూర్జటి, శ్రీనాథుడు, శ్రీశ్రీ... వీరి పద్యాలు, కవితలు నాన్న తాదాత్మ్యంతో చదువుతూంటే... ‘ఇంతింతై వటుడింతై..’లాంటి పద్యాలు విని నేర్చుకున్నాను. అందువల్లే ఐఏయస్లో పద్యాలు పూర్తిగా రాసేశాను. నాన్నతో పోటాపోటీగా షటిల్ ఆడేదాన్ని.
– ఆకురాతి పల్లవి,
(సమగ్ర పిల్లల రక్షణ యోజన, బెంగళూరు, భారత ప్రభుత్వం)
– సంభాషణ: వైజయంతి పురాణపండ
No comments:
Post a Comment