Sunday, June 28, 2020

ఈ చెయ్యి చాలు సేవ చేయటానికి...


శరీరంలో అన్ని అవయవాలూ సక్రమంగా ఉండి కూడా సేవ చేయలేని వారు చాలామందే ఉంటారు. 
శరీరం సహకరించకపోయినా, మనసు సేవ చేయమని చెబుతుంటే, సేవ చేయకుండా ఉండగలరా.
కర్ణాటక ఉడిపిలో ఈ పది సంవత్సరాల చిన్నారి సింధూరి మనసుకు వైకల్యం లేదు. 
సింధూరి ఆరో తరగతి చదువుతోంది.
భగవంతుడు ఆమెకు ఒక్క చెయ్యి మాత్రమే ఇచ్చాడు. 
రెండు చేతులు లేని వారి కంటె నేనే చాలా నయం అనుకుంది.
ఒక్క చేత్తోనే మిషన్‌ మీద మాస్కులు కుట్టటం ప్రారంభించి, తోటి స్నేహితులందరికీ అందచేస్తోంది. ‘‘స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ లో మా స్కూల్‌ తరఫున లక్ష మాస్కులు కుట్టి, ఎస్‌ఎస్‌ఎల్‌సి వాళ్లకి అందచేయాలి. నేను 15 మాస్కులు కుట్టాను. మొదట్లో నేను, నా నిస్సహాయతకు బాధపడ్డాను. కాని అమ్మ నాకు ధైర్యం చెప్పింది’’ అంటూ తనకు తల్లి ఇచ్చిన ధైర్యం గురించి ఎంతో ఆనందంగా చెబుతుంది సింధూరి. 
వీరు కట్టిన మాస్కులను 12 తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు అందచేశారు. ఈ పరీక్షకు హాజరయ్యేవారికి మాస్కులు తప్పనిసరి. సింధూరి చాలా తెలివైన పిల్ల అని, శ్రద్ధగా చదువుకుంటుందని ఆ పాఠశాల టీచర్లు సింధూరిని మెచ్చుకుంటారు. సింధూరి మౌంట్‌ రోజరీ ఇంగ్లీషు మీడియంలో చదువుకుంటోంది. 
కరోనా మహమ్మారి కారణంగా యువతలో ఉన్న ప్రతిభ బయటకు వస్తోంది. వీరంతా చాలా విలక్షణంగా వారి వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. కొందరు మాస్కులు కుట్టి ఉచితంగా అందచేస్తుంటే, మరి కొందరు వారు దాచుకున్న డబ్బుల్ని పేదలకు ఉపయోగిస్తున్నారు.
ఏప్రిల్‌ నెలలో, 17 సంవత్సరాల ఒక దివ్యాంగుడు తను బహుమతిగా గెలుచుకున్న రెండు లక్షల రూపాయలను ప్రధానమంత్రి సహాయనిధికి అందచేశాడు. ఢిల్లీకి చెందిన మరో విద్యార్థి 3డి ప్రింటర్‌తో ఫేస్‌ షీల్డ్‌ తయారుచేశాడు. పదో తరగతి చదువుతున్న జరేబ్‌ వర్ధన్‌.. 100 ఫేస్‌ షీల్డులు తయారుచేసి, ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌ఎన్‌ శ్రీవాత్సవ్‌కి అందచేశాడు. 
యువతరమే దేశానికి బలం అన్న మాటలను ఈ యువత చేతలలో చూపుతున్నారు. బాధ్యతతో మెలగుతున్న ఈ యువతకు సెల్యూట్‌ చేయాల్సిందే.

No comments:

Post a Comment